అదానీ-అంబానీ కంటే పవర్ ఫుల్ తెలంగాణ ఆడబిడ్డలు..!

 అదానీ-అంబానీ కంటే పవర్ ఫుల్ తెలంగాణ ఆడబిడ్డలు..!

Loading

అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో మహిళలు వేలాదిగా పాల్గొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

“వనపర్తిలో నేను నేర్చుకున్న రాజకీయ చైతన్యం తోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాను. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోంది. రాష్ట్రంలో 25 లక్షల 50 వేల మంది రైతులకు 22 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా నిధులను కూడా ఖాతాల్లో వేశాం.రాష్ట్రంలో  విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్ల కు పైగా పెరిగినా ఎక్కడా  విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.

ఇప్పటివరకు 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. దాని కోసం 4500 కోట్ల రూపాయలు చెల్లించాం. స్వయం సహాయక సంఘాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలకు పునరుజ్జీవం కల్పించాం. రాష్ట్రంలో 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వనపర్తి సాక్షి గా ఈ రోజు 1000 కోట్ల రూపాయల రుణాలను ఆడబిడ్డలకు ఇచ్చాం..

హైటెక్ సిటీ శిల్పారామం పక్కనే స్వయం సహాయక మహిళల కోసం 150 స్టాల్స్  ఏర్పాటు చేశాం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల పక్కనే మహిళా సంఘాలకు మూడున్నర ఎకరాల స్థలం ఇస్తారని ఎప్పుడైనా ఊహించారా?  అదానీ, అంబానీ లే కాదు తెలంగాణ స్వయం సహాయక మహిళలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. 1000 బస్సులను స్వయం సహాయక మహిళలతో కొనుగోలు చేయించి  ఆర్టీసీ కి అద్దెకు ఇచ్చేలా చేశాం. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు కుట్టే పనిని స్వయం సహాయక మహిళలకు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలను నిర్వహించే బాధ్యతను కూడా ఇచ్చాం. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ను మహిళల పేరుతో ఇస్తున్నాం.

ఇందిరమ్మ రాజ్యం లో మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలు ఇచ్చాం. దేశ చరిత్రలో ఇదొక రికార్డు. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కరించాం. మెట్రో రైలు విస్తరణ నుంచి మూసీ పునరుజ్జీవం దాకా తలపెట్టిన అన్ని పనులను పూర్తి చేసి తీరుతాం. ” అని ముఖ్యమంత్రి  చెప్పారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *