పదేండ్లకి కేటీఆర్ కి సోయి వచ్చిందా..!

Congress MLA meets former minister KTR..!
Politics : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటీ టీఆర్ఎస్ .. ఇప్పటి బీఆర్ఎస్ అరవై మూడు స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి మొన్నటి లోక్ సభ ఎన్నికల ఓటమి వరకు ఇటు ఆ పార్టీకి చెందిన మాజీ తాజా ఎమ్మెల్యేల దగ్గర నుండి.. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. సీనియర్ నేతల వరకు క్యాడర్ను పట్టించుకున్న నాధుడే లేడని తెలంగాణ భవన్ లో విన్పిస్తున్న వార్తలు. అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మాజీ మంత్రులు కేటీఆర్.. హారీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల వరకు పలుమార్లు చెప్పిన మాట పదేండ్లు ప్రజలకు దగ్గరగా ఉన్నాము.. సంక్షేమాభివృద్ధి చేశాము తప్పా క్యాడర్ కోసం.. పార్టీ బలోపేతం గురించి ఆలోచించలేదని. వారు అన్నది అక్షరాల నిజం.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీకి చెందిన క్యాడర్ అంతా తాము అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన క్యాడర్ సైతం కష్టపడిన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత.. సెకండ్ క్యాడర్ పై ఉన్న అసంతృప్తి.. చేసిన పనులు చెప్పుకోకపోవడం. అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల మూడోసారి అధికారంలోకి రాకుండా చతికిలబడింది. తాజాగా తన ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ “బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్ళు..గత ఏడాదిగా కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై పోరాటాలు చేస్తూనే మరోవైపు ఆరు గ్యారంటీల అమలుపై అలుపెరగని ఉద్యమాలు చేస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులెట్టిన కానీ నెరవకుండా సమరంలో దూసుకుపోతున్నారు. మీరే పార్టీకి ఆయువుపట్టు. మిమ్మలని కాపాడుకుంటాము.. రాబోయేది మన పార్టీనే అని ఉత్సాహాం నింపేలా ట్వీట్ చేశారు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ అధికారంలో ఉన్న పదేండ్లలో ఏనాడు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా .. ఎంతసేపు అధికారక కార్యక్రమాలతో.. ప్రజలకు సేవ చేయడంతోనే కాలం గడిపిన పదేండ్ల తర్వాత సోయి వచ్చిందా.. పార్టీకి పునాది రాళ్లు కార్యకర్తలే అని.. ఇప్పటికైన మాటపై నిలబడి పార్టీకోసం కష్టపడే వారిని గుర్తించి ప్రోత్సహించాలి.. ఇతర పార్టీల నుండి చేరికలను వద్దనడం లేదు.కానీ దాదాపు ఇరవై నాలుగేండ్లు పార్టీ కోసం పని చేస్తున్న.. తమ జీవితాలను త్యాగం చేసిన కార్యకర్తలను.. క్యాడర్ ను గుర్తించి ఆదుకుంటే పార్టీ మరో ముప్పై ఏండ్లు అధికారంలో ఉంటుంది.
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీపై ఐదేండ్లకు రావాల్సిన వ్యతిరేకత ఏడాదిలోనే మూటకట్టుకుంది. ఇప్పటికైన సోయి వచ్చినందుకు మంచిది.. పార్టీకి అన్ని శుభాలే.. ఈసారైన పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రభుత్వంపై పోరాడాలని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు.. కార్యకర్తలు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏడాదిగా ప్రకటనలే చేస్తున్న కేటీఆర్ ఇప్పటికైన గులాబీ బాస్ కేసీఆర్ తో కల్సి యాక్షన్ కు దిగుతారేమో..!