ఏడాది పాలనలో కటింగ్..కటాఫ్ లే..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓట్లకోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లు, కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మి రూ. 2500, ఆసరా పెన్షన్లు, రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల పెన్షన్, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కట్ చేశారు..
రైతులకు రూ. 3 లక్షల వడ్డీ లేని రుణం, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా, నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం, ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్, రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం, కమిషన్, ఆర్టీసీ విలీన ప్రక్రియ, ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.12 వేలు, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ కట్ చేశారు..
కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలకు రేవంత్ రెడ్డి సర్కార్ కటింగ్ పెట్టిందని కేటీఆర్ తెలిపారు.200 యూనిట్లు ఉచిత కరెంట్ కటాఫ్, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు, ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్, పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు కటాఫ్ ఎందుకు..? అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు..? డబుల్ బెడ్రూంలకు మూడు రంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అని కేటీఆర్ విమర్శించారు. జాగో తెలంగాణ జాగో అని ఆయన నినదించారు.