రేవంత్ ఏడాది పాలన- పథకాల కోతలు. కాదంటే కేసులు..!
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ డైరీ 2025 ఆవిష్కరణ కార్యక్రమం సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సభలుగా విలసిల్లినయి, ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈ డైరీ తిరగేస్తుంటే 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, మన పార్టీ సాధించిన విజయాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఈ డైరీని తమ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి డైరీ ఆవిష్కరణ సభలు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి సభ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలపడానికి, తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడాలి.
రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి పాలన ఏడాది అయిపోయింది. ఏడాదిలో ఏమన్నా చేసిందా అంటే..అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే.. వాటికి కోతలు పెట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా ఎగవేస్తున్నారు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెడుతున్నారు. ఇంతకుమించి రేవంత్ రెడ్డి సాధించినదైతే ఏమీ లేదే. మానకొండూరు సభలో నేను మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డీ నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, రైతుబంధు ఎగ్గొట్టినవు, తులం బంగారం ఎగ్గొట్టినవు, మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, వృద్ధులకు 4 వేల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు
నీపేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఇప్పటినుంచి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్నాను. ఎగ్గొట్టినోన్ని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా?. ఇదన్నందుకు మానకొండురు పోలీస్ స్టేషన్లో నామీద కేసు పెట్టిండు. ఇపుడు పోలీస్ స్టేషన్ కు రమ్మని నాకు నోటీసుల మీద నోటీసులు వస్తున్నయి. నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా, నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా?. ఏం చేసినవు నాయనా నువ్వు, పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ తప్ప.. కేటీఆర్ గారి మీద అక్రమ కేసు పెట్టి, అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేసి, పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ చేస్తవు. లగచర్ల రైతులను అరెస్టు చేసి, 15 రోజులు డైవర్షన్ చేసినవు. అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినవు.
దానికంటే ముందు తెలంగాణ తల్లి విగ్రహం మార్చి అదో 15 రోజులు డైవర్షన్. టీఎస్ ను టీజీగా మారుస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్. తెలంగాణ ఎంబ్లమ్ మారుస్తున్నా అని చెప్పి డైవర్షన్ టాక్టిక్స్. ఇవి తప్ప నువ్వు ప్రజలకు చేసిందేమైనా ఉన్నదా? నువ్విచ్చిన హామీలు అమలు చేసిందేమన్నా ఉన్నదా?. కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాల పరిస్థితి ఏమైంది?. ఇవాళ కల్యాణలక్ష్మి చెక్కులు పిల్లలు పుట్టినంక వస్తున్నయి, ఆరోజు.. పెండ్లి కాకముందే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఈరోజేమో పిల్లలు పుట్టాక కూడా చెక్కులు రాని పరిస్థితి. కేసీఆర్ కిట్లు బందు అయిపోయినయి, న్యూట్రిషన్ కిట్లు బందయిపోయినయి. బతుకమ్మ చీరెలు బందు అయిపోయినయి. రైతుబందు బందయిపోయింది, బీసీ బందు బందయిపోయింది, దళిత బందు బందయిపోయింది.
ఉన్న పథకాలు బందు పెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చిందేమన్నా ఉన్నదా?. రైతు భరోసా అన్నవు, అపుడేమో ఎకరానికి 15 వేలు ఇస్త అన్నవు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒక్క పంటకు ఎకరాకు 5 వేలే ఇచ్చినవు. వానాకాలం ఎగ్గొట్టినవు. మళ్లీ ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికలున్నయి గనుక మల్లొక్కసారి రైతుబంధు వేస్తాడు, తర్వాత ఎగ్గొడుతడు ఈ ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిండు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. పంటల బీమా అని ఊరించిండు, రెండు పంటలకు ఎగబెట్టిండు. ఏ ఒక్క వర్గానికీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం చేసిండు. జార్ఖండ్ లో మహిళలకు 2500 పింఛన్ ఇస్తా అని చెప్పి, మొదటి నెలలోనే మాట నిలబెట్టుకున్నడు అక్కడి కొత్త సీఎం హేమంత్ సోరెన్.
మరి, రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇస్తా అని బాండ్ పేపర్ పై సంతకం పెట్టి, 13 నెలలు నిండినా మహాలక్షి అమలు చేయలేదు. ఏపీలో మొదటి నెలలోనే 2 వేల పింఛన్ 4 వేలు చేసి మాట నిలబెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి 40 లక్షల మంది అవ్వాతాతలకు 4 వేల ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాట తప్పిండు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో 60 మంది పిల్లలు చనిపోయినారు. వాళ్లకు సరిగా అన్నం పెట్టకుండా ఆస్పత్రుల పాలు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. సోషల్ మీడియా అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములు.. ఇలా ఎవరు ప్రశ్నిస్తే, వారిపై కేసులు పెడుతున్నడు. సంక్షేమ పథకాలేమైనయి అంటే డబ్బుల్లేవంటడు.
కానీ, ఈయన కుటుంబ సభ్యుల భూముల దగ్గరకి వేల కోట్లు ఖర్చుపెట్టి కల్వకుర్తి దాకా ఆరు లేన్ల రోడ్లు వేసుకుంటున్నడు. 50 వేల కోట్లతోని మెట్రో రైలు మార్గాలు చేస్తానంటున్నడు. ఎలివేటెడ్ కారిడార్లు కడతా అంటున్నడు. ఆసరా పెన్షన్లకు, రైతు బంధుకు పైసల్లేవంటడు. మూసీకి లక్ష కోట్లు ఎక్కడినుంచి వస్తున్నయి. బడా కాంట్రాక్టర్లకు పైసలివ్వడానికి, ఢిల్లీకి కమీషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలొస్తయి. రైతులకు, మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బుల్లేవా అని అడుగుతున్నాం. బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని బద్నాం చేసిండు నిండు అసెంబ్లీ సాక్షిగా.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4 లక్షల 17 వేల కోట్లు అని స్పష్టం చేసినం. మీరు ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పు చేస్తరు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండేండ్లు కరోనా ఉన్నా, ఏటా 41 వేల అప్పు మాత్రమే చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే 1 లక్ష 37 వేల కోట్ల అప్పు చేసింది. ఎవరు అప్పులు ఎక్కువ చేసినట్లో గమనించాలె. అప్పులు, అప్పులంటే అసెంబ్లీలోనే లెక్కలు చెప్పినం. మేం కాళేశ్వరం కట్టినం, పాలమూరు కట్టినం, చెరువులు బాగు చేసినం, జిల్లాకో మెడికల్ కాలేజీ, గురుకులాలు కట్టినం. ఇంటింటికీ నల్లాలు పెట్టినం, నిరంతరాయ విద్యుత్ ఇచ్చినం. మేం ఏడాదికి 40 వేల కోట్లతో ఇవన్నీ చేస్తే, నువ్వు 1 లక్షా 40 వేల కోట్లతో కూడా చేసిన పని ఒక్కటీ లేదు. బీఆర్ఎస్ కట్టిన ఫ్లై ఓవర్లకు, భవనాలకు, ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేస్తున్నవు. ఈ మాట అడిగినందుకే కదా కేటీఆర్ గారిపై కేసులు పెట్టినవు
లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ గారు ఎంతో కష్టపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా అండగా నిలబడి, న్యాయం చేశాడు. కేటీఆర్ కు ఆపద వస్తే కూడా పార్టీ మొత్తం అండగా నిలబడుతది. కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ప్రశ్నించే గొంతుపై, ఒక ఉద్యమకారుడిపై పెట్టిన కేసు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రాఫ్ దిగజారిపోతున్నది గనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజలను డైవర్షన్ చేస్తున్నడు. కుట్రలో భాగంగానే కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టిండు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆపదొస్తే బీఆర్ఎస్ ఎట్లా నిలబడ్డదో, పార్టీ మొత్తం కేటీఆర్ వెంట ఉంటది” అని అన్నారు.