ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి

తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు.
పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ , నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు.ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముంది.
అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరగాలి. కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం ముందుగా భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి. అందుకు రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసుకోవాలి. భూసేకరణలో మానవీయత ఉండాలి. భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలి.
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో పేరుకుపోయిన పూడిక తీతపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఏ ఏ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వాటికి అవసరమైన నిధుల వివరాలను నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశం నుంచి అన్ని జిల్లాల ఎస్ఈలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.