అన్నం పెట్టే అన్నదాతకు రేవంత్ రెడ్డి సున్నం
తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరం అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారు అని హరీశ్రావు నిలదీశారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం. అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని పిలుపునిస్తున్నా అని హరీశ్రావు పేర్కొన్నారు.