కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థికసాయం

 కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థికసాయం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు.


కిష్టయ్య ప్రాణత్యాగం తో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువు తో సహా ప్రతి కష్టకాలం లో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకొంటున్న కేసీఆర్ గారు, నాడు కిష్టయ్య బిడ్డ ఎంబీబీఎస్ వైద్య విద్యకోసం అవసరమైన ఆర్థికసాయం అందించారు.

. నాడు ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతున్నది. అందుకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజుకోసం కావలసిన 24 లక్షల రూపాయల చెక్కును నేడు నంది నగర్ లో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు.

అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు.వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు.

“ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్న పిల్లలు. కష్టకాలంలో కూడా అమ్మ మిమ్ములను ఎంతో కష్టపడి సాదుకుంది, చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలో నైనా నా సహకారం ఉంటూనే ఉంటుంది.” అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు.ఈ సందర్భంగా తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా అదుకుంటున్న కేసీఆర్ కు కిష్టయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *