కేసీఆర్ పాలనలో దళితులకు అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు పదేండ్ల కేసీఆర్ పాలనలో దళితులకు అడుగడుగున అన్యాయం జరిగింది.తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా దళితుడ్ని చేస్తానని హామీచ్చారు. తీరా రాష్ట్రం వచ్చాక రెండు సార్లు ఆయన సీఎం అయ్యారు తప్పా దళితుడ్ని చేయలేదు. కంటితుడుపు చర్యగా దళితుడ్ని డిప్యూటీ సీఎం గా చేసి అదే దళితుడ్ని అవమానకరపరిస్థితుల్లో పదవి నుంచి కేసీఆర్ దించేశాడు. నాడు పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్కరే మంత్రిగా ఉంటే నేడు ప్రజాపాలనలో ఐదుగురు మంత్రివర్గంలో ఉన్నారు.
అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , దామోదర రాజనరసింహా ఉన్నారని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ” నాడు కేసీఆర్ పాలనలో భార్యభర్తలిద్దరూ స్వేచ్చగా మాట్లాడుకునే అవకాశం లేదు. కానీ నేడు నాలుగు కోట్ల మంది ఫోన్లలో మాట్లాడుకునే స్వేచ్చ ఉంది.
గత పదేళ్ళు పదవులు అనుభవించినవాళ్ళు ఇప్పుడు వీధి నాటకాలకు బయలు దేరారు. తొలిరోజు నుంచే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. మాకు కొంతకాలమైన సమయం ఇవ్వరా..? చావుల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ చూస్తోంది అని ఆయన విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అరవై వేల ఉద్యోగాలిచ్చాము. ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశాము. ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడైన ఉందా అని ఆయన ప్రశ్నించారు.
