హస్తం గుర్తు బదులు బుల్డోజర్ గుర్తు

కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైదర్షాకోట్లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఆదివారం పరిశీలించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని.. ముందు మీ ఇండ్లు కూల్చుకొని తర్వాత పేద ప్రజల దగ్గరికి రావాలన్నారు. మీకో న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహిస్తున్నదని విమర్శించారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించాలని హితవు పలికారు. తెలంగాణలో ఈ బుల్డోజర్ రాజకీయాలేంటని ప్రశ్నించారు.
పేదలకు ఇండ్లు లేకుండా చేయడటమే రేవంత్ లక్ష్యంగా ఉందన్నారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని బాధితులకు ధైర్యం నూరిపోశారు. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా తామే ఒక రక్షణ కవచం లాగా నిలబడతామన్నారు. బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమల్ని ఎత్తాలి తప్ప.. మీ ఇళ్లను ఎత్తనిచే ప్రశ్నే లేదన్నారు
మూసీని ఆక్రమించి భవనాలు కట్టినవారిని అడ్డుకోవట్లేదన్నారు.
పెద్దల జోలికి పోవడం లేదు కానీ పేదల ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. పథకాలకు పైసలు లేవుకానీ పేదల ఇండ్లు కూలగొడుతారా అని విమర్శించారు. రేవంత్ రెడ్డి హిట్లర్లా వ్యవహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ అందరికి ప్రజాభవన్. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ బాధితులకు అండగా ఉంటుందన్నారు. అర్ధరాత్రి వచ్చినా అండగా ఉంటామన్నారు.
రేవంత్ రెడ్డి మౌనం వీడి.. స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మూసీపై ప్రతిపాదిన ప్రాజెక్టును విరమించుకోవాలన్నారు. గాంధీ దవాఖానలో సరైన వైద్యం అందట్లేదు. మూసీ పరీవాహకంలో నిర్మాణాలకు గతంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. చర్యలు తీసుకోవాలనుకుంటే ఆయా ప్రభుత్వాలపై తీసుకోవాలన్నారు..
