ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.15వేల కోట్లకు టెండర్..!
ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వo లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అన్నారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ ” కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి మరో నిదర్శనం. ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టింది.
“డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తా”మని చెప్పారు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గుచేటు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడం అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనే కదా అర్థం. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన వలన రియల్ ఎస్టేట్ కుదేలైందని మేము ముందు నుండే చెప్తుంటే బుకాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు ? ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించండి. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయండి” అని ట్వీట్ చేశారు.