రైతుభరోసా కు కోత.. అన్నదాతకు గుండెకోత..
రైతు భరోసాకు కోతపెట్టిన కాంగ్రెస్ సర్కారు అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది.. పెట్టుబడి సాయం కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని రూ.12 వేలకు కుదించి దగా చేసింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రైతాంగాన్ని నమ్మించి పచ్చి మోసానికి పాల్పడ్డ సీఎం రేవంత్రెడ్డికి తగిన సమయంలో రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
‘ఎకరాకు రూ.15 వేలు ఇస్తామంటూ ఎన్నికల సభ ల్లో ఊదరగొడుతూ ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి.. అదే గద్దెనెక్కినంక గద్ద లా మారి అన్నదాతలను దారుణంగా వంచిస్తున్నారని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.ఎకరా కు రూ.12 వేల చొప్పున ఇస్తామని క్యాబినెట్ లో నిర్ణయించి రైతుల ఆశలను అడియాసలు చేశారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ మానస పుత్రిక, ప్రపంచమే మెచ్చిన రైతుబంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
‘భూమి కలిగిన రైతులకే కాదు.. కౌలు రైతులకూ ఏటా రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి క్యాబినెట్లో ఆ ఊసే ఎత్తకుండా ధోకా చేశారని ధ్వజమెత్తారు. ‘సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టి చిల్లర నాటకంగా మార్చేశారు.. బోనస్ మాటను బోగస్ చేశారు.. పంట బీమాను పత్తాలేకుండా చేశారు’ అం టూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వానకాలంలో ఎగ్గొట్టిన రైతుభరోసాతో కలిపి రూ.15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు