“ఫోన్ ట్యాపింగ్ ” పాపం ఆయనదే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో పెనుసంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సిట్ అధికారులు నిన్న శనివారం విచారించారు. విచారణలో ప్రణీత్ రావు పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చిన ప్రణీత్ రావును సాయంత్రం నాలుగంటల వరకు సిట్ అధికారులు విచారించారు.
విచారణలో ఫోన్ ట్యాపింగ్ పాపం ప్రభాకర్ రావుదే అని మొదటి నుంచి చెబుతూ వచ్చిన ప్రణీత్ రావు ఇదే అంశాన్ని చెప్పినట్లు సమాచారం. 2023 నవంబర్ పదిహేను తారీఖున ఒక్కరోజులోనే 650 ఫోన్లు ట్యాపింగ్ జరిగిన విషయం గురించి ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. దీనిపై ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఇదే నిజం అని అంగీకరించినట్లు తెలిసింది.
2023 నవంబర్ నెలలో లెక్కకు మించి ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేశాము. ఇదంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగిందని ఆయన అంగీకరించినట్లు టాక్. ఆ సమయంలోనే మావోల పేరుతో రాజకీయ, సినీ, ప్రముఖుల , వ్యాపార వేత్తల ఫోన్లు ట్యాపింగ్ జరిగిన విషయం కూడా వాస్తవమే అని ప్రణీత్ రావు అంగీకరించారని తెల్సింది. కానీ ఇదంతా నా పరిధిలోనిది కాదని నాటి ఎస్ఐబీ బాస్ ప్రభాకర్ రావు పరిధిలోని అంశాలు అని చెప్పినట్లు కూడా సమాచారం.