త్వరలో సమగ్ర హెల్త్ టూరిజం పాలసీ..!

ప్రపంచంలో ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవాలన్న దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా అవసరమైన వైద్య సహకారం అందించడానికి వీలుగా సమగ్ర హెల్త్ టూరిజం పాలసీని తీసుకురానున్నట్టు తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డు పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏఐజీ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ…
“అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల సౌకర్యాలతో విమానాశ్రయానికి సమీపంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఆ క్యాంపస్లో అన్ని రకాల స్పెషలైజేషన్స్, వైద్య సేవలు అందించడానికి ఆయా సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఫార్మా రంగంలో ప్రపంచంలోనే 35 శాతం బల్క్ డ్రగ్ తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతోంది. కోవిడ్ విపత్తు సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వ్యాక్సిన్ తెలంగాణ నుంచి సరఫరా అయింది. ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా తెలంగాణ రాష్ట్రం ఆ స్థాయికి రావాలి. ఆ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోయే పాలసీ రూపకల్పనలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి సహకారం కావాలి.
రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి డేటా ప్రైవసీతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. తద్వారా ఒక వ్యక్తి హాస్పిటల్కు వెళ్లినప్పుడు ఆ వ్యక్తి అంతకుముందు ఎలాంటి వైద్యం తీసుకున్నాడు. ఎలాంటి చికిత్సలు జరిగాయి. ఎలాంటి మందులు వాడారన్న సమగ్రమైన సమాచారాన్ని డిజిటిల్ హెల్త్ కార్డులో నమోదవుతుంది. ఒకప్పుడు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్కు వస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే వారి కోసం హైదరాబాద్కు నేరుగా విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. అలా వచ్చే వారి కోసం విడిగా కౌంటర్లు పెట్టి వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని అనుకున్నాం.
పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచాం. గడిచిన ఒక్క ఏడాది కాలంలోనే నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ కింద 900 కోట్ల రూపాయలు అందించాం. నాలుగు దశాబ్దాలకు పైగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఇక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వారు దీన్ని బాధ్యత అనుకున్నందునే ఇంత గొప్ప గౌరవం దక్కింది. వారికి భారతరత్న రావడానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది” అని చెప్పారు.
ఈ సన్మాన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు దామోదర రాజనర్సింహ , ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , శాసనసభ్యులు గడ్డం వివేక్ , డాక్టర్ పీఎస్ రెడ్డి , డాక్టర్ విష్ణు రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
