KCR  ముందుచూపుతోనే RRR

 KCR  ముందుచూపుతోనే RRR

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి..బీఆర్‌ఎస్ అధినేత,    కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్‌) ఆలోచన చేశామని బీఆర్‌ఎస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు.  హైదరాబాద్‌ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ రూపొందించామని పేర్కొన్నారు.

ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్‌ గడ్కరీతో కేసీఆర్‌, తాను బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) తరహాలో సుమారు 300 కిలో మీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ట్రిఫుల్‌ఆర్‌ నిర్మిస్తే వేల కోట్ల తెలంగాణ ప్రజల ధనం ఖర్చవుతుందని నాడు కేసీఆర్‌ భావించారని తెలిపారు.

తెలంగాణ ప్రజల ధనం ఖర్చు కాకుండా, కేంద్ర నిధులతో రోడ్డు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు వచ్చే సుమారు పది జాతీయ రహదారులను అనుసంధానించేలా కేంద్ర ప్రభుత్వ నిధులతో (మోర్త్‍) ట్రిఫుల్‌ఆర్‌ నిర్మించాలని నాడు ముందుచూపుతో కేసీఆర్‌ ఆలోచన చేశారని తెలిపారు.

నాగపూర్‌, భూపాలపట్నం, భద్రాచలం, విజయవాడ, బెంగళూరు, బెల్గాం, ముంబై, నాందేడ్‌, మెదక్‌-పిట్లం, రాజీవ్‌ రహదారి.. ఇలా మొత్తం పది ముఖ్యమైన జాతీయ రహదారుల వాహనాలు నగరంలోకి రాకుండానే గమ్య స్థానాలకు వెళ్లేలా హైవేల అనుసంధానంతో ట్రిఫుల్‌ఆర్‌ నిర్మించాలని నిర్ణయించారని పేర్కొన్నారు.మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‍పోర్టు, హైవేస్ (మోర్త్‍) అధికారులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వారితో అనేకసార్లు అలైన్‌మెంట్‌పై నాటి సీఎం కేసీఆర్‌ చర్చించారని గుర్తుచేశారు.

అనేక చర్చల అనంతరం ఉత్తర భాగానికి చెందిన ట్రిఫుల్‌ఆర్‌ నిర్మాణానికి అనుమతులు లభించాయని తెలిపారు. దక్షిణభాగానికి సైతం కేసీఆర్‌ హయాంలోనే ప్రణాళికలు జరిగాయని, ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రతిపాదనలు ఆగాయని పేర్కొన్నారు.కానీ, కేసీఆర్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించడం తగదని హితవుపలికారు.

ఆ మాటలు అనే అర్హత కోమటిరెడ్డికి లేదని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.ముందున్న  ప్రభుత్వాలు తలపెట్టిన పనులు కొనసాగించడం తదుపరి వచ్చే ప్రభుత్వ బాధ్యత అని, పంతాలకు పోకుండా నాటి ట్రిఫుల్‌ఆర్‌ పనులను కొనసాగిస్తున్నందుకు సంతోషమని తెలిపారు.అదే సందర్భంలో ఉత్తరభాగం పనులకు టెండర్లు పిలువడంతోనే ఆపకుండా త్వరగా పూర్తిచేయడంతోపాటు దక్షిణభాగం పనులకు సంబంధించిన అనుమతులు కూడా తేవాలని రేవంత్‌ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు.ఈ మేరకు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *