జగన్ పై టీడీపీ ఫేక్ ప్రచారం.. అందుకేనా..?

 జగన్ పై టీడీపీ ఫేక్ ప్రచారం.. అందుకేనా..?

YS Jagan Mohan Reddy

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, వారి సోషల్‌మీడియా అబద్ధాలను వండి వారుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి పాస్‌పోర్టుపై వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. వారంరోజులుగా విజయవాడ నగరం వరద దిగ్భందంలో ఉంటే, లక్షలాది మంది బాధితులు ఆక్రోశిస్తుంటే వారికి బాసటగా ఉండాల్సింది పోయి బురదరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి హోదాలో వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు ఈఏడాది నవంబర్‌ వరకూ గడువు ఉందని, అయితే ఆ పదవినుంచి దిగిపోయిన పరిస్థితుల నేపథ్యంలో డిప్లమాటిక్‌ పాస్‌పోర్టును స్వచ్ఛందంగా వైయస్‌.జగన్‌ అప్పగించారని వెల్లడించారు. ఈనేపథ్యంలో కొత్తగా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారని, ఇది పోలీసు వెరిఫికేషన్‌ కి వెళ్లిందన్నారు. శ్రీ వైయస్‌.జగన్‌పై ఒక ప్రైవేట్ కంప్లైంట్‌ ఉందన్న విషయాన్ని పోలీసులు వెరిఫికేషన్‌లో రాశారన్నారు. గతంలో సాక్షి మీడియాలో వచ్చిన ఒక కథనం ఆధారంగా 6 ఏళ్ల క్రితం ఇప్పటి టీడీపీ మంత్రి నారాయణ కోర్టులో ప్రైవేటు కేసు వేస్తే, ఆ విషయాన్ని పోలీసులు వెరిఫికేషన్‌లో పేర్కొన్నారన్నారు.

దీనిపై దిగువ కోర్టులో కేసు వేయగా, కోర్టు ఎన్‌ఓసీ ఇస్తూ, ఏడాది కాలపరిమితికి పాస్‌పోర్టు మంజూరుకు ఆదేశాలు జారీచేసిందని, అయితే సీబీఐ కోర్టు వైయస్‌.జగన్‌ పాస్‌పోర్టుకు ఐదేళ్లు ఎన్‌ఓసీ గడువు ఇచ్చిన విషయాన్ని మళ్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీబీఐ కోర్టు ఆదేశాలమేరకు ఏడాదిపాటు ఎన్‌ఓసీ ఇస్తూ దిగువ కోర్టు ఆర్డర్‌ను సవరించమని కోరామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. ఇష్టాను సారం వార్తలు ప్రచారం చేసి, శ్రీ జగన్‌గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి యత్నించారని మండిపడ్డారు.

విజయవాడ వరదల నియంత్రణ, సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి పక్కదోవ పట్టించడానికి ఈ తరహా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఇండియన్ పాస్‌పోర్టు యాక్ట్‌ ప్రకారం వాస్తవంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదై, కోర్టు పరిగణలోకి తీసుకున్న కేసుల్లోనే పాప్‌సోర్టు అధికారి అభ్యంతరం వ్యక్తంచేయవచ్చని, కానీ పోలీసులు వెరిఫికేషన్‌లో పేర్కొన్న కేసు ప్రైవేట్ కేసని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టంచేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *