ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్..!

 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్..!

Loading

కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది.

ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది. నోటీసులకు ఈనెల 25వ తేదీలోగా సమాధానం చెప్పాలని కూడా సుప్రింకోర్టు ఆదేశించింది. తాజాగా సుప్రింకోర్టు జారీచేసిన నోటీసులకు స్పీకర్ గడ్డం ఏమని సమాధానం చెబుతారనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. 2023లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తరపున గెలిచిన పదిమంది ఎంఎల్ఏలు అధికారపార్టీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.

నిజానికి ఫిరాయింపుల రాజకీయానికి తెరలేపిందే కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్ళల్లో టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన 23 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉన్నపుడు యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి రాగానే అవే ఫిరాయింపులకు రేవంత్ పాల్పడటాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అందుకనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై వెంటనే అనర్హత వేటువేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుల్లో కేసులు వేశారు. మొదట బీఆర్ఎస్ వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. అసెంబ్లీ స్పీకర్ వ్యవస్ధ అధికారాల్లో జోక్యం చేసుకునేదిలేదని హైకోర్టు స్పష్టంగా తేల్చేసింది. కాకపోతే అనర్హత వేటు విషయంలో ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోమని మాత్రం స్పీకర్ కార్యాలయానికి సూచించింది.

హైకోర్టులో తాము ఆశించినట్లుగా తీర్పురాకపోవటంతో వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. స్పీకర్ అధికారాల్లో తాము జోక్యంచేసుకుని శాసనవ్యవస్ధ అధికారాల్లోకి జొరబడేందుకు హైకోర్టు నిరాకరించింది. అందుకనే కేటీఆర్ తాను సుప్రింకోర్టులో కేసు వేయటమే కాకుండా పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ తో కూడా కేసులు దాఖలుచేయించారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు దాఖలుచేసిన కేసులపైన సుప్రింకోర్టు విచారణ చేస్తోంది. విచారణలో భాగంగానే బుధవారం స్పీకర్ కు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది. మరీ నోటీసులకు స్పీకర్ ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *