పన్నుల బకాయిల వసూళ్లలో రాజీపడొద్దు

Sanjeevareddygari Savitha Minister of Backward Classes Welfare of Andhra Pradesh
పెనుకొండ పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేద్దామని, పన్నుల బకాయి వసూళ్లలో రాజీపడొద్దని మున్సిపల్ అధికారులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవితమ్మ స్పష్టంచేశారు. పెనుకొండలో మౌలిక వసతుల కల్పన అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో శ్రీకృష్ణదేవరాయులు,బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ పాలక వర్గ సమావేశంలో మంత్రి సవితమ్మ పాల్గొని ప్రసంగించారు.
పెనుకొండ మున్సిపాల్టీలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనీజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కియా వంటి పరిశ్రమలు ప్రస్తుతం పెనుకొండలో ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను తీసుకురానున్నామని, ఈ నేపథ్యంలో పట్టణంలో మౌలిక వసతుల కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పెనుకొండలో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఉద్యోగులు, ఇతరులు అనంతపురం, పుటపర్తి వంటి ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. పట్టణంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తే, పెనుకొండలోనే నివాసం ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇదే విషయమై ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాని, పెనుకొండలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపునకు ఆయన సుముఖం వ్యక్తంచేశారని మంత్రి వెల్లడించారు.
