ఆప్ ఓటమికి ఆ మహిళనే కారణం..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది దాదాపు ఇరవై ఏడు వసంతాల తర్వాత అధికార పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెల్సిందే. మరోవైపు ఆప్ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాల్లోనే విజయడంకా మ్రోగించింది.
ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనిష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి ఆప్ అగ్రనేతలు సైతం ఓడిపోయారు. ఈ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం ‘ద్రౌపది వస్త్రాపహరణం’ ఫొటోతో తన అభిప్రాయాన్ని ఆమె ఎక్స్ వేదికగా వ్యక్తపరిచారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అని, ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అని, ఎంతో కష్టపడి బీజేపీని గెలిపించారని కామెంట్స్ చేస్తున్నారు. స్వాతి కష్టాన్ని బీజేపీ గుర్తిస్తుందని నెటిజన్లు అంటున్నారు.