ప్రతి గ్రామానికి సరైన రోడ్లుండాలి

Pawan Kalyan Deputy CM Of Ap
దేశంలో ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలనే ఆశయంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకి దిశా నిర్దేశం చేశారు. పల్లె దారులకి అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సమకూరుస్తుంది. రాష్ట్రంలో 250 మించి జనాభా ఉన్న ప్రతి గ్రామానికి పక్కా రోడ్ల సదుపాయం కల్పించేలా, గ్రామాల మధ్య అనుసంధాన దారులను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
శుక్రవారం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏఐఐబీ ప్రతినిధులు పవన్ కర్కి, తౌషిక్ రెహ్మాన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు స్వరూపాన్ని బ్యాంకు ప్రతినిధులు, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బ్యాంకు ప్రతినిధులు, అధికారులతో మాట్లాడుతూ ‘‘ గ్రామీణ ప్రాంతాల్లో వేసే రోడ్లు వరదలకు కొట్టుకుపోకుండా, వర్షాలకు చిధ్రం కాకుండా ఉండాలి. ఆధునాతన పరిజ్ఞానం ఉపయోగించి వీటిని పక్కాగా వేయండి. రోడ్ల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దు. ఎక్కువ కాలం నిలిచిపోయేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతిసారీ రోడ్లు పాడవకుండా నిబంధనల ప్రకారం పటిష్టంగా రోడ్లు వేసేలా కాంట్రాక్టర్లకు స్పష్టమైన నియమావళిని ఇవ్వాలి. పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రాజెక్టు పూర్తి అయ్యేలోగా రాష్ట్రంలో రహదారులు లేని గ్రామాలు లేకుండా సమగ్రంగా ప్రాజెక్టు రూపకల్పన చేయండి. పనులు వేగంగా, పకడ్భందీగా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలి’’ అన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు బాలు నాయక్, సి.వి.సుబ్బారెడ్డి, పి.వి. రమణ మూర్తి, కె.చక్రవర్తి, బి.డి.శ్రీనివాస్ పాల్గొన్నారు.




